కుల సంఘాల భవనాలు శిలాఫలకాలకే పరిమితం
ABN , First Publish Date - 2022-05-21T05:24:38+05:30 IST
నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన కుల సంఘాల భవనాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, చేసినా వస్తాయనే నమ్మకం కూడా లేదనే భయంతో కాంట్రాక్టర్లు నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ పనులను డీఎంఎ్ఫటీ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్ట్)తో చేపట్టాలని నిర్ణయించగా.. ఈ నిధులను ప్రభుత్వం వినియోగించుకుందని, అందుకే పనులు చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయడం లేదని విమర్శలున్నాయి.
ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు
పలుచోట్ల వెక్కిరిస్తున్న పునాదులు, మొండి గోడలు
హుస్నాబాద్, మే 20 : నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన కుల సంఘాల భవనాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, చేసినా వస్తాయనే నమ్మకం కూడా లేదనే భయంతో కాంట్రాక్టర్లు నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ పనులను డీఎంఎ్ఫటీ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్ట్)తో చేపట్టాలని నిర్ణయించగా.. ఈ నిధులను ప్రభుత్వం వినియోగించుకుందని, అందుకే పనులు చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయడం లేదని విమర్శలున్నాయి.
రెండేళ్ల క్రితం శంకుస్థాపన
హుస్నాబాద్ పట్టణంలో ముస్లిం, మునూరు కాపు, రెడ్డి, విశ్వబ్రాహ్మణ, వైశ్య, స్వర్ణకార, పద్మశాలి, అంబేడ్కర్, మేదరి, రజక, కుమ్మరి, బుడిగజంగాల కులాలకు కమ్యూనిటి హళ్ల నిర్మాణానికి రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. ఇందులో కొన్ని పునాదులు, స్లాబ్ లెవెల్ వరకు పనులు జరుగగా చాలావరకు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఆరు నెలల క్రితం చేసిన కొన్ని పనులకు బిల్లులు వచ్చాయని, ఆ తరువాత చేసిన పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
షాదీఖానాకు మూడేళ్లు..
ముస్లింల షాదీఖానాకు ఎల్లమ్మ చెరువు మత్తడి సమీపంలో ఎకరం స్థలం కేటాయించారు. రూ.46 లక్షలతో నిర్మించేందుకు 2019 ఫిబ్రవరి 20వ తేదీన శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. రెడ్డి కమ్యూనిటీహాల్, మున్నూరు కాపు కమ్యూనిటీహాల్లకు సంవత్సరం క్రితం శంకుస్థాపన చేశారు. కానీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. మరోవైపు ఐదేళ్ల క్రితం ప్రకటించిన బంజారాభవన్ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సిద్దేశ్వరగుట్టపై 20 గుంటల స్థలంలో రూ. కోటి నిధులతో దీనిని నిర్మిస్తున్నారు.