విశాఖలో తనఖా ఆస్తుల కుదింపు
ABN , First Publish Date - 2021-06-19T08:02:28+05:30 IST
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో తనఖా పెట్టాలని ప్రతిపాదించిన 20 ఆస్తులను 15కి కుదించారు. కలెక్టర్ కార్యాలయం, సర్క్యూట్ హౌస్ (ప్రభుత్వ అతిథిగృహం) రెండూ వందేళ్లు దాటిన నిర్మాణాలని పలువురు
కలెక్టరేట్కు మినహాయింపు
సర్క్యూట్ హౌస్, మరో మూడింటికీ..
మిగిలిన 15 ఆస్తుల తాకట్టుకు ఏర్పాట్లు
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో తనఖా పెట్టాలని ప్రతిపాదించిన 20 ఆస్తులను 15కి కుదించారు. కలెక్టర్ కార్యాలయం, సర్క్యూట్ హౌస్ (ప్రభుత్వ అతిథిగృహం) రెండూ వందేళ్లు దాటిన నిర్మాణాలని పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఆ రెండింటినీ మినహాయించారు. అలాగే జిల్లా శిక్షణ కేంద్రం స్థలాన్ని ఇప్పటికే వేలానికి పెట్టడంతో దానినీ తప్పించారు. ఆరిలోవలో పశు సంవర్ధక శాఖ భూమిలో హౌస్ బిల్డింగ్ సొసైటీ ఉండడంతో పక్కనపెట్టారు. ఇక మహారాణిపేట తహశీల్దార్ కార్యాలయం నడుస్తున్న భవనం దేవదాయ శాఖది. ‘తనఖాలో విశాఖ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ప్రచురించిన కథనం చూసిన దేవదాయ శాఖ అధికారులు.. తమకు రూ.22 లక్షల అద్దె బకాయి ఉందని, వెంటనే చెల్లించాలని, ఆ తర్వాత కార్యాలయం కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. దాంతో రెవెన్యూ అధికారులు ఆ ఆస్తిని కూడా తనఖా జాబితా నుంచి తప్పించారు. ఈ ఐదు పోను మిగిలిన 15 ఆస్తుల జాబితాను, వాటికి సంబంధించిన పత్రాలను సీసీఎల్ఏ పేరిట బదలాయించడానికి అమరావతికి పంపించారు. కాగా, తెలుగుదేశం విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలా కలెక్టరేట్ను, విద్యాలయాలను, వికలాంగుల శిక్షణ కేంద్రాలను తనఖా పెట్టలేదని, విజయసాయిరెడ్డి ఆ విషయాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.