ఆర్టీసీ కార్గో సేవలకు ఏడాది పూర్తి
ABN , First Publish Date - 2021-06-19T05:18:00+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది.
మెదక్ రీజియన్లో రూ.1.42 కోట్ల ఆదాయం
మెదక్ అర్బన్, జూన్ 18: ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. మెదక్ రీజియన్ పరిధిలో కార్గో బస్సుల ద్వారా 1.85 లక్షల పార్శిల్స్ చేరవేయడంతో రూ. 1.42 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ రీజియన్ పరిధిలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోలున్నాయి. వీటి పరిధిలో నిత్యం దాదాపు రూ. 55 వేల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది మే 12 నుంచి లాక్డౌన్ కొనసాగించడంతో కొంతమేర కార్గో సేవల ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు రూ. 40 వేల వరకు ఆదాయం వస్తున్నది. ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని రకాల సర్వీసులను తరలిస్తున్నారు. వినియోగదారులు కార్గో సేవల్ని ఆదరించి సంస్థకు తోడ్పాటునందించాలని ఆర్ఎం రాజశేఖర్ పేర్కొన్నారు.