కదలని చదువులు
ABN , First Publish Date - 2022-01-08T04:49:03+05:30 IST
కేజీబీవీలో విద్యాబోధన గాడిలో పడడం లేదు. ముఖ్యంగా ఇంటర్ విద్య ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇంతవరకూ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పరీక్షలకు మరో రెండు నెలల వ్యవధే ఉంది. సిలబస్ చూస్తే పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయాలో అధికారులకే తెలియాలి. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 132 పోస్టులకు గత ఏడాది డిసెంబరు 4న నోటిఫికేషన్ విడుదల చేశారు.
పరీక్షలు సమీపిస్తున్నా పూర్తికాని సిలబస్
కేజీబీవీల్లో కానరాని అధ్యాపకులు
నియామక ప్రక్రియలో ఎడతెగని జాప్యం
ఇంటర్ విద్యాబోధనపై ప్రభావం
ఆందోళనలో తల్లిదండ్రులు
(కలెక్టరేట్)
కేజీబీవీలో విద్యాబోధన గాడిలో పడడం లేదు. ముఖ్యంగా ఇంటర్ విద్య ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇంతవరకూ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పరీక్షలకు మరో రెండు నెలల వ్యవధే ఉంది. సిలబస్ చూస్తే పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయాలో అధికారులకే తెలియాలి. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 132 పోస్టులకు గత ఏడాది డిసెంబరు 4న నోటిఫికేషన్ విడుదల చేశారు. 2,390 మంది వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన తరువాత ప్రొవిజినల్ జాబితాను విడుదల చేశారు. అనుభవానికి సంబంధించి ధ్రువపత్రాల విషయంలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మండలాల వారీగా త్రిమెన్ కమిటీతో విచారణ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రివైజ్డ్ మెరిట్ జాబితాను విడుదల విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలను శనివారంలోగా తెలియజేయాలని అధికారులు ప్రకటించారు. అంటే భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ నెల 8 నుంచి 17 వరకూ సంక్రాంతి సెలవులు. ఆ తరువాత నియామక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 33 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. తొలుత ఆరు నుంచి పదో తరగతి వరకూ మాత్రమే బోధించేవారు. 2018-19 నుంచి కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. 2018-19లో మూడు పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారు. 2019-20లో 16 పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2020-21లో మిగిలిన 14 పాఠశాలకు విస్తరించారు. 2018 నుంచి 2020 వరకూ ఆప్గ్రేడ్ చేసిన 19 కాలేజీల్లో గెస్ట్ టీచర్లను తీసుకుని బోధించారు. 2020లో అప్గ్రేడ్ చేసిన కొత్తవలస, గంట్యాడ, డెంకాడ, బొండపల్లి, పూసపాటిరేగ, బాడంగి, సాలూరు, పాచిపెంట, బలిజిపేట, మెరకముడిదాం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, తెర్లాం మండలాల్లో ఉన్న 14 పాఠశాలల్లో బోధకులను నియమించలేదు. కనీసం గెస్ట్ టీచర్ల నియామకం లేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై 140 రోజులు గడుస్తున్నా సిలబస్ పూర్తికాలేదు. సీఆర్టీలే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.
గెస్ట్ టీచర్లతో బోధన
కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు జరుగుతున్నాయి. గెస్ట్ టీచర్లతో బోధిస్తున్నాం. త్వరలో అధ్యాపకులు, సీఆర్టీల నియామకం పూర్తవుతుంది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేస్తాం. ఇప్పటికే రివైజ్డ్ మెరిట్ జాబితా విడుదల చేశాం.
-డాక్టర్ వేమలి అప్పలస్వామినాయుడు, ఏపీసీ, సర్వశిక్ష