కియా సహా నాలుగు కంపెనీలపై... కేంద్రానికి ఢిల్లీ న్యాయవాది ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-02-08T22:11:58+05:30 IST

కాశ్మీర్ అంశంపై వివాదాస్పద పోస్టులు పెట్టిన నాలుగు కార్పొరేట్ కంపెనీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది.

కియా సహా నాలుగు కంపెనీలపై...  కేంద్రానికి ఢిల్లీ న్యాయవాది ఫిర్యాదు

వాటిని బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు 

* ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీస్ శాఖ

న్యూఢిల్లీ : కాశ్మీర్ అంశంపై వివాదాస్పద పోస్టులు పెట్టిన నాలుగు కార్పొరేట్ కంపెనీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఆ నాలుగు కంపెనీలు కూడా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేశాయని, వాటి రిజిస్ట్రేషన్, వ్యాపారపరమైన లైసెన్సులను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోన్న నేపధ్యంలో... ఈ అంశం కేంద్రానికి చేరింది. ఢిల్లీ పోలీసులకూ ఫిర్యాదులు వెళ్ళాయి. కియా, హ్యుండాయ్, పిజ్జాహట్, కేఎఫ్‌సీ కంపెనీలపై ఢిల్లీకి చెందిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు.


కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే కార్పొరేట్ వ్యవహారాల విభాగంతో పాటు ఢిల్లీ పోలీసుల వద్ద ఈ నాలుగు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ చట్టంలోని 121 ఏ, 153, 153 ఏ, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం, లాభాలను ఆర్జించడంలో భాగంగా ఈ నాలుగు కంపెనీలు పాకిస్తాన్‌లో కాశ్మీర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేశాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.


జమ్మూ కాశ్మీర్ అంశం అత్యంత సున్నితమైనదని, దీనిని వ్యాపారపరంగా మార్చుకోవడానికి ఈ కంపెనీలు యత్నించాయని వినీత్ జైన్ ఆరోపించారు. కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. హ్యుండాయ్, కియా, పిజ్జాహట్, కేఎఫ్‌సీ ఈ పోస్ట్ చేసిన తరువాత భారత్‌లో వాటిపై తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. ఈ నాలుగు కంపెనీలను బహిష్కరించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను హోరెత్తించారు.


ఈ క్రమంలో... ఆయా కంపెనీలు దిగొచ్చాయి. భారతీయులకు క్షమాపణలు చెప్పాయి. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన ఆకాంక్షలను తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నాయి. భారతీయులతో తమకు తమకు స్నేహ సంబంధాలు, ఉన్నాయని, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పే  అవుతుందని పేర్కొంది. పాకిస్తాన్ విభాగం చేసిన ఆయా ట్వీట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ... దుమారం తగ్గలేదు. తాజాగా న్యాయవాది వినీత్ జైన్.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Updated Date - 2022-02-08T22:11:58+05:30 IST