ఏపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోంది
ABN , First Publish Date - 2020-09-19T09:13:50+05:30 IST
ఏపీ ప్రభుత్వం మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని, మతపరంగా పాలిస్తోందని, హిందూ దేవాలయాలపై వరుసగా
- కేంద్ర హోం మంత్రి షాకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని, మతపరంగా పాలిస్తోందని, హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ ద్వజమెత్తారు. హిందూ దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని, జగన్ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్తో కలిసి జీవీఎల్ మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా ‘చలో అంతర్వేది’ పోరాటానికి వెళ్తున్న బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారం ప్రతిఒక్కరికీ ఉందని, కానీ, ఏపీ ప్రభుత్వం నిరసనలపై ఉక్కుపాదం మోపుతోందని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని రమేశ్ ధ్వజమెత్తారు.