డీఈవో పోస్టుకు పోటీ

ABN , First Publish Date - 2021-07-25T06:02:41+05:30 IST

జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డికి త్వరలో పదోన్నతి లభించనున్నది.

డీఈవో పోస్టుకు పోటీ

రేసులో ఇద్దరు మహిళా అధికారులు

త్వరలో లింగేశ్వరరెడ్డికి పదోన్నతి


విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డికి త్వరలో పదోన్నతి లభించనున్నది. ఆయన స్థానంలో డీఈవోగా వచ్చేందుకు ఇతర జిల్లాల్లో పనిచేసే ఇద్దరు మహిళలు తీవ్రంగా పోటీపడుతున్నారు. జిల్లా స్థాయి అధికారిగా రావాలంటే  జిల్లాకు చెందిన మంత్రి, ఇన్‌చార్జి మంత్రి ఆశీస్సులు ఉండాలి. ఈ నేపథ్యంలో ఒక మహిళా అధికారి ఇద్దరు మంత్రుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. మరో మహిళా అధికారి కూడా జిల్లా మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, కోస్తాలో మరో జిల్లాకు చెందిన మంత్రి వద్ద సిఫారసు లేఖ తీసుకున్నారు. ప్రస్తుతం ఇరువురు మహిళా అధికారులు పనిచేసే జిల్లాలు కోస్తాలో ప్రధానమైనవే కావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో విశాఖకు ప్రాధాన్యం వున్నందున ఇక్కడ పోస్టింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యా శాఖాధికారులుగా పనిచేసే వారిలో ఏడుగురికి ప్రాంతీయ సంచాలకులుగా పదోన్నతి లభించనున్నది. ఈ ప్యానల్‌లో విశాఖ డీఈవో లింగేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. బహుశా వచ్చే నెల రెండో వారంలోపు పదోన్నతులు రావచ్చునని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విశాఖ డీఈవోగా రావడానికి ముందుగానే ఇద్దరు మహిళలు ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది.

Updated Date - 2021-07-25T06:02:41+05:30 IST