పరిహారం ఎప్పుడో..?

ABN , First Publish Date - 2022-08-20T05:21:04+05:30 IST

కాలువ కోసమని భూమి తీసుకున్నారు. పరిహారం మాత్రం ఇవ్వలేదు. కాలువ తవ్వారు. అందులో వచ్చిన మట్టి, రాళ్లను అదే భూమిలో గుట్టలు గుట్టలుగా పోశారు

పరిహారం ఎప్పుడో..?
పేరుకుపోయిన మట్టిదిబ్బలు


కుందుర్పి బ్రాంచ కెనాల్‌కు భూములు ఇచ్చిన రైతులు

ఏళ్లు గడిచినా అందని సొమ్ము

జీవనాధారం కోల్పోయి అవస్థలు పడుతున్న  వైనం

కంబదూరు (కళ్యాణదుర్గం), ఆగస్టు 19: కాలువ కోసమని భూమి తీసుకున్నారు. పరిహారం మాత్రం ఇవ్వలేదు. కాలువ తవ్వారు. అందులో వచ్చిన మట్టి, రాళ్లను అదే భూమిలో గుట్టలు గుట్టలుగా పోశారు. దీంతో ఆ భూమిలో సేద్యం చేయడానికి వీలులేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందక, సేద్యం చేసుకోలేక భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. జీడిపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలను కళ్యాణదుర్గం మీదుగా బీటీపీకి అందించి, నియోజక వర్గంలోని 144 చెరువులకు నీరివ్వాలనే ఉద్దేశంతో కళ్యాణ దుర్గం మండలంలోని గరుడాపురం నుంచి కుందుర్పి వరకు కాలువ నిర్మించాలని 2017లో నిర్ణయించారు. కుందుర్పి బ్రాంచ కెనాల్‌ పేరుతో సర్వే పనులు చేశారు. మండలంలోని ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో 177 మంది రైతుల నుంచి 196.83 ఎకరాల భూమి సేకరించా రు. డీకేటీ భూములు ఎకరాకు రూ.4.5 లక్షలు, పట్టా భూములకు రూ. 10 లక్షలు ఇచ్చేలా నిర్ణయించారు.   కానీ నేటికి అతి కొద్ది మంది రైతులకు మాత్రమే పరిహారం అందింది. మిగతావారు పరిహారం కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కొంతమంది రైతులు భూమిని కోల్పోవడంతో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. 


Updated Date - 2022-08-20T05:21:04+05:30 IST