ఉద్యమాలకు దిక్సూచి ఆమె ఆత్మకథ

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

నవయాన ప్రచురణ సంస్థవారు ఇటీవల - ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త అయిన గీతా రామ స్వామి ్ఞపకాలను..

ఉద్యమాలకు దిక్సూచి ఆమె ఆత్మకథ

నవయాన ప్రచురణ సంస్థవారు ఇటీవల - ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త అయిన గీతా రామ స్వామి ్ఞపకాలను ‘Land, Guns, Caste, Woman’ అనే పేరుతో వెలువరించారు. 1970ల్లో నాటి యువతరంపై విశేషమైన ప్రభావం చూపిన నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు, ఆ తరువాతి కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన వివిధ మార్క్సిస్టు-లెనినిస్టు గ్రూపులు- ముఖ్యంగా పీపుల్స్‌ వార్‌ గ్రూపు- చేసిన పోరాటాలు, అవి రేకెత్తించిన చర్చలూ, భిన్నాభిప్రాయాలూ- అధునిక తెలుగురాష్ట్రాల చరిత్రతో పెన వేసుకుపోయాయి. ఈ పరిణామాలన్నీ ఈ రచనకు నేపథ్యంగా నిలుస్తాయి. ఆ ఉద్యమాలకు కేంద్ర బిందువైన భూపోరాటాల ప్రాముఖ్యత ఈ రచనలో తెలిసివస్తుంది. అలాగే 1980ల నాటి స్త్రీవాద ఉద్యమపు తొలిదినాలు, భూస్వామ్య వ్యవస్థకే కాకుండా పితృస్వామ్యానికి కూడా ఎదురొడ్డి నిలబడ్డ అసామాన్య మాదిగ స్త్రీల అనుభవాలు, క్షేత్రస్థాయిలో గీతా స్వయంగా ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తాయి.


సాంప్రదాయబద్ధమైన తమిళ బ్రాహ్మణ యువతిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, మాదిగలతో సహవాసం చేసి, తెలుగు నేర్చుకొని, వారిలో ఒకరిగా నిలిచిన సాహసోపేతమైన ప్రయత్నం ఈ రచనకుగల ప్రత్యేకత. కులవ్యవస్థని నిలదీయకపోతే భారతదేశంలో ఏవిధమైన సామాజిక చైతన్యం, పోరాటం నిలదొక్కుకోలేవని మరోసారి ఈ జ్ఞాపకాలు మనకు గుర్తుచేస్తాయి.


ఒక జీవితకాలపు సంఘర్షణను వెనుతిరిగి పరిశీలించినపుడు - వ్యక్తిగత అనుభవాలు, సామాజికాంశాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోతాయి. 1972లో జార్జిరెడ్డిని గూండాలు హత్య చేసినపుడు గీతారామస్వామి ఉస్మానియా కేంప్‌సలో ఉండడం తటస్థించింది. అప్పటికామెకు ఏవిధమైన రాజకీయాలతోనూ పరిచయంలేదు. ఉద్వేగభరితమైన 1970లలో ఆమె వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షింపబడడం సహజసిద్ధంగానే జరిగిపోయింది. రాజకీయ చైతన్యం అనేది విద్యావంతులూ, సంస్కరణవాదులూ అయిన మధ్య, ఉన్నత తరగతుల సమూహాలతోనే మొదలవుతూ వచ్చింది అన్ని దేశాలలోనూ. ఎందుకంటే చదువు మూలంగా వారికే మొట్టమొదట కొత్త ఆలోచనలూ, తాజా సమాచారం, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పడుతుంది. ఈ అనివార్య పరిణామం - ఏకకాలంలో - సంస్కరణోద్యమానికి దోహదకరం; సమూల మార్పును కోరుకొనే విప్లవ రాజకీయాలకు అడ్డుకట్ట. భారతదేశపు కమ్యూనిస్టు పార్టీలు నేటికీ అగ్రవర్ణ ఆధిపత్యం నుండి, పితృస్వామ్యం నుండి బయటపడలేకపోతున్నాయన్న విమర్శలో వాస్తవం ఉన్నది. అయితే ఇప్పుడు ‘క్రింది’ కులాల, వర్గాల వారికి కూడా విద్యా, ఉద్యోగావకాశాలు ఏదో ఒక మేరకు అందుతు న్నందున ఈ ధోరణి మారబోతున్నది. గీతా ఈ అంశాలను, పరిణామాలను ప్రస్తావిస్తుంది పుస్తకంలో.


దక్షిణాది బ్రాహ్మణులు చాలామంది ఉద్యోగాలవైపు ముందుగానే మళ్లి భూమితో సంబంధాల్ని తెంచుకున్నారు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీతాకి ఉదారవాద, వామపక్ష రాజకీయాలవైపు ఆమె చెయ్యాలనుకున్న ప్రయాణం సులభంగానే సాధ్యపడి ఉండాలి. కానీ ఆమె కుటుంబీకులామెను కట్టడిచేశారు, నిర్బంధించారు, చివరకి మానసికరోగిగా గుర్తించి (కమ్యూనిస్టులు చేసిన బ్రెయిన్‌వా్‌షని వదలగొట్టాలనే ఆలోచనతో!) బలవంతంగా షాక్‌ ట్రీట్మెంటు ఇప్పించారు. వ్యక్తిగత జీవితంలో గీతా ఎదుర్కొన్న నిర్బంధాలన్నింటిలోనూ ఇది ఆమెకు ఎంతోకాలం మాయని గాయంగా ఉండిపోయిందనిపిస్తుంది. అలాగే ప్రాణ స్నేహితులనుకున్నవాళ్లు ఆకస్మికంగా దూరం కావడం, ఆమెను హత్య చెయ్యడానికి భూస్వాములు చేసిన ప్రయత్నం - ఇవన్నీ ఈ పుస్తకంలో ఎదురవుతాయి.


మంచి అనుభవాలు లేవా? అంటే చాలా ఉన్నాయి. (జార్జిరెడ్డి సోదరుడు) సిరిల్‌ రెడ్డితో వివాహం, ఒడిదొడు కుల మధ్యనే అయినా సజీవబంధంగా మారిన వారి అనుబంధం, వాళ్లు కలిసిచేసిన సామాజిక కార్యక్రమాలు, ఘజియాపుర్‌లో దంపతులిరువురూ చదువు చెప్పిన పేదపిల్లలు వృద్ధిలోకి రావడమూ, ఎన్నో ఏళ్ల తరువాత వారిని కలుసుకోవడమూ పాఠకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.


అలాగే- హైదరాబాదు సమీపంలోని ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో గీతా, ఆమె అనుచరులూ మాదిగలను సమీకరించిన తీరు విస్మయం కలగజేస్తుంది. చదువులేని, వెనుకబడ్డ సమూహాలుగా చెప్పబడే ఈ జనుల చైతన్యం, జీవితానుభవాల నుంచి ఉద్భవించిన విజ్ఞత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా స్త్రీల నిబద్ధత, సృజనాత్మకత మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. వారి డప్పుల చప్పుడు మన గుండెల్ని తాకుతుంది.


గత ముప్ఫై ఏళ్లుగా నిర్విరామంగా కృషిచేస్తూ - ఉత్తమస్థాయి పుస్తకాలనూ, అనువాదాలనూ తెలుగు పాఠకులకు అందజేస్తూన్న హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కి అధిపతిగా, చోదకశక్తిగా నిలిచిన గీతా రామస్వామి తెలుగు పాఠకులందరికీ పరిచయమే.



స్థానికుల సహకారంతో గీతా, ఆమె సహచరులూ కలిసి - ఏ రాజకీయ పార్టీకీ అనుబంధ సంస్థగా కాకుండా - ఒక స్వతంత్ర ట్రేడ్‌ యూనియన్‌గా స్థాపించిన ‘ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీ సంఘం’, పార్టీల కార్యాచరణలో భాగంగా ముందుకి సాగే పోరాటాలకు పూర్తిగా భిన్నంగా ఉద్యమించింది. ఈ అనుభవాలను గీతా ఈ పుస్తకంలో వివరంగా చర్చిస్తుంది. సంఘం, తొలుత వెట్టిచాకిరీ నుండి విముక్తిపై దృష్టిపెట్టింది. వందలాది ఎకరాలకు అధిపతులైన రెడ్డి భూస్వాములకు పక్కలో బల్లెంగా మారింది. అసలు భూస్వాముల దోపిడీ, దాష్టీకాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 1930-40లలో ఉండేవి అనే ఒక తప్పుడు అభిప్రాయం అనేకులలో పేరుకుపోయి ఉంది. హైదరాబాదు శివార్లలో, 1980ల వరకూ అంత తీవ్రమైన, కరమైన భూ స్వామ్య దోపిడీ కొనసాగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.


తరువాతి దశలో సంఘం తన దృష్టిని భూమి పంపిణీపైకి సారించింది. అసలు సమస్య ఇదే అని త్వరలోనే వెల్లడైంది. లీగల్‌ పోరాటాల పరిధిలోనే అనేక విజయాలను సాధించింది. లా చదివిన ఇంజినీరు సిరిల్‌, ‘సలహా’ అనే సంస్థను నెలకొల్పి లీగల్‌ సేవలను అందించాడు.


ఇటువంటి మౌలిక పోరాటాలను చేబట్టినపుడు అనేకానేక సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకుపోవాల్సి ఉంటు ంది. ఉదాహరణకి వెట్టి చాకిరి రద్దును సాధించుకున్నప్పుడు పశువుల కాపరులుగా ఉండిన పిల్లలకు చదువుకొనే అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పరిమితంగా ఉన్నాయి. అప్పుడేం చెయ్యాలి? సిరిల్‌ రెడ్డి, తదితరులు చొరవతీసుకొని గ్రామస్థాయి విద్యాసంస్థలను స్థాపించారు; నిర్వహించారు. ఆ పిల్లలకు విద్యావకాశాలు కల్పించారు.

మన దేశంలో ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయస్థాయి ఉద్యమాలు అనతి కాలంలోనే ఇతిహాసాలుగా, కథలుగా, ఉద్వేగభరితమైన పాటలుగా, నినాదాలుగా మారిపోతాయి. వీరగాథలు ప్రచారంలోకి వస్తాయి. వాస్తవాలు మరుగున పడతాయి. ఉద్యమాల్లో పాల్గొన్నవారు, పార్టీ పట్ల విధేయత కలిగినవాళ్లు అన్నీ చెప్పరు; కొన్నే చెబుతారు. మొత్తానికి వాస్తవం ఏమిటనేది తెలియకుండా పోతుంది. అటువంటి సందర్భాలలో ఆయా ఉద్యమాల విజయాలు, లేదా వైఫల్యాలనుండి నేర్చు కోగల అవకాశాలు కుదించుకుపోతాయి. ఇందుకు భిన్నంగా గీతా, ఆమె సన్నిహితులు చేబట్టిన ఉద్యమం స్థలకాలాలపరంగా పరిమితమైనది; స్థానికమైనది. ఆద్యంతాలు, పరిణామాలు, ఫలితాలు పారదర్శకమైనవి. అందుచేత అటువంటి స్థానిక ఉద్యమాలు అందజేసిన క్షేత్రస్థాయి అనుభవాలను అన్ని కోణాలనుండీ అధ్యయనం చెయ్యడం సుసాధ్యం.

అందుచేత ఈ పుస్తకంలో సింహభాగంగా నిలిచిన ఇబ్రహీంపట్నం పోరాటానుభవం - అటు సామాజిక

కార్యకర్తలకూ, రాజకీయ పార్టీలకూ, ముఖ్యంగా మార్పుని కోరుకొనే వామపక్షాలకూ- ఇటు పాలనావ్యవస్థకూ, న్యాయవ్యవస్థకూ ఉపయోగపడుతూ, అనేక గుణపాఠాలను అందించగల ఒక బృహత్తర పాఠ్యాంశం అవుతుంది, సమగ్రమైన కేస్‌ స్టడీగా నిలిచిపోతుంది. రాబోయే కాలాల్లో స్థానిక ఉద్యమాలు, పోరా టాల ప్రాముఖ్యత పెరగుతుందని దేశంలో నెలకొంటూన్న వివిధ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ కారణాలవల్ల గీతా రామస్వామి ఈ పుస్తకంలో నిజాయితీగా నమోదు చేసిన జ్ఞాపకాలు, చర్చకు పెట్టిన అంశాలు నేటి తరానికి, రాబోయేకాలపు ఉద్యమాలకు ఉపయుక్తంగా ఉండగలవు.


ఉణుదుర్తి సుధాకర్‌

90006 01068

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST