తోటివారికి తోడుగా

ABN , First Publish Date - 2021-05-06T06:21:18+05:30 IST

ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న నానుడిని నిజం చేస్తుంది నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎల్‌వీ సేవా సంస్థ.

తోటివారికి తోడుగా
భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఎల్‌వీ సేవాసంస్థ వ్యవస్థాపకుడు ఎల్‌వీ కుమార్‌

కరోనా బాధితుల కడుపునింపుతున్న ఎల్‌వీ సేవా సంస్థ

నిత్యం 200మందికి ఇంటి వద్దకే భోజనం సరఫరా 

ఫోన్‌ చేస్తే మరుసటి రోజే భోజనం సౌకర్యం

నల్లగొండ కల్చరల్‌:  ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న నానుడిని నిజం చేస్తుంది నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎల్‌వీ సేవా సంస్థ. కరోనా వైరస్‌తో బాధపడుతున్న బాధితుల ఆకలి తీర్చేందుకు ముం దుకొచ్చి ఆపత్కాలంలో బాధితుల ను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్‌ బారిన పడి కుటుంబసభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో రోగికి కనీసం ఆహా రం అందించలేని దీన గాథలకు చలించిన ఎల్‌వీకుమార్‌ తనకు టుంబానికి చెందిన 10మంది సభ్యులతో నల్లగొండలో ఎల్‌వీ సేవా సంస్థను నెలకొల్పారు. తాను చైర్మన్‌గా ఉంటూ ఆ సంస్థ ద్వారా కరోనా బాధితులకు నిత్యం రెండుపూటలా కడుపునింపుతున్నారు ఎల్‌వీ కుమార్‌. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి ఉచితంగా భోజనం సరఫరా చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అన్నం, పప్పు, చెట్ని, కోడిగుడ్డు మిరియాలచారు, పెరుగు, అప్పడంతో విడివిడి ఫ్యాక్‌ చేయిస్తారు. 10 మంది మిత్రుల సహకారంతో బైక్‌లపై మధ్యాహ్నం 12నుంచి 2గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌రోడ్‌, రామగిరి, మిర్యాలగూడ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మునుగోడు రోడ్డులో గుర్తించి కరోనా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆ భోజనం ప్యాకెట్లను అందజేస్తారు. ఈ సంస్థలో నల్లగొండ అశోక్‌, తేలుకుంట్ల శ్రీకాంత్‌, అనిశేట్టి శేఖర్‌, కాసం శేఖర్‌, కాసంవెంకన్న, తల్లం గిరి బాధితుల ఇళ్లకు వెళ్లి సేవలందిస్తున్నారు. అదే విధంగా పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు కూడా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నారు. సంస్థలో పనిచేసే వారంతా సేవా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు.  ప్రతిరోజూ 200మంది బాఽధితులకు రెండు పూటలా ఆహారాన్ని ఉచితంగా అందజేస్తారు. రోజుకు సుమారు రూ.16వేలు ఖర్చు వస్తుంది. ఈ మొత్తం ఖర్చును సేవా సంస్థ సభ్యులే భరిస్తున్నారు. గత ఏడాది మొదటి విడత కరోనా సమయంలో హైదరాబాద్‌లోని స్లమ్‌ ఏరియాలో వెయ్యికి పైగా మాస్కులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా సొంతంగా వంట వండించి పేదల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఆకలి తీర్చారు. చలికాలంలో పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న బాధితులకు దుప్పట్లు అందజేశారు. 

Updated Date - 2021-05-06T06:21:18+05:30 IST