మహిళల ఆర్ధిక స్థిరత్వంపై అవగాహన కల్పించిన 'నాట్స్'

ABN , First Publish Date - 2022-03-03T18:14:02+05:30 IST

ఇల్లాలే ఇంటికి వెలుగు అనేది చాటి చెప్పేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నడుంబిగించింది.

మహిళల ఆర్ధిక స్థిరత్వంపై అవగాహన కల్పించిన 'నాట్స్'

ఎడిసన్, న్యూజెర్సీ: ఇల్లాలే ఇంటికి వెలుగు అనేది చాటి చెప్పేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నడుంబిగించింది. అతివలు ఆర్థిక స్థిరత్వం సాధించాలనే లక్ష్యంలో భాగంగా వారాంతాల్లో నాట్స్ వరుసగా మహిళల ఆర్థిక స్వావలంబనపై వెబినార్స్ నిర్వహిస్తోంది. అతినడునా ఎక్సోసియ(ఏడీఈ) విమెన్ ఎంపవర్‌మెంట్ సంస్థ నాయకురాలు, టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి ఈ వెబినార్‌కు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక అక్షరాస్యత, మహిళల ఆర్థిక స్థిరత్వం అనే అంశాలపై అవగాహన కల్పించారు. అసలు మహిళలు పొదుపు ఎలా ప్రారంభించాలి..? చిన్న మొత్తాలతోనే పెద్ద పెద్ద ఆర్ధిక లక్ష్యాలను ఎలా సాధించాలి..? రిటైర్‌మెంట్ సమయానికి ఆర్ధికంగా ఏ ఢోకా లేకుండా ఎలా చేసుకోవాలి..? పొదుపు చేసిన సొమ్మును ఎలా పెట్టుబడులకు మళ్లించాలి..? ఆర్ధిక అంశాలపై స్వల్పకాలిక లక్ష్యాలు ఎలా ఉండాలి..? దీర్ఘకాలిక లక్ష్యాలు ఎలా ఉండాలనే అంశాలపై దుర్గా ప్రశాంతి గండి చక్కగా వివరించారు. క్రెడిట్ స్కోర్ ఎలా మేనేజ్‌చేసుకోవాలనేది కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న మహిళల ఆర్థిక సందేహాలను నివృత్తి చేశారు. వారిలో సరికొత్త ఆర్థిక ఉత్సాహాన్ని నింపారు. 


ఈ వెబినార్‌కు మాధవి దొడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన కుటుంబాల్లో సంతోషాలకు కొదవ ఉండదనే భావనతోనే నాట్స్ మహిళల ఆర్థిక అక్షరాస్యతపై దృష్టిసారించిందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ ఇక ముందు మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ఆమె తెలిపారు. ఈ వెబినార్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన జయశ్రీ పెద్దిబొట్ల, జ్యోతి వనం, లక్ష్మీ బొజ్జ, బిందు యలమంచిలి, పద్మజ నన్నపనేని, ఆషా వైకుంఠం, ఉమ మాకం, గీత గొల్లపూడిలను నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2022-03-03T18:14:02+05:30 IST