ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: రాజు భార్య మౌనిక

ABN , First Publish Date - 2021-09-18T00:14:19+05:30 IST

ప్రభుత్వం ఆదుకోకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు భార్య పల్లకొండ మౌనిక రోదించింది.

ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: రాజు భార్య మౌనిక

మోత్కూరు: ప్రభుత్వం ఆదుకోకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు భార్య పల్లకొండ మౌనిక రోదించింది. ‘‘నా భర్త ఆ పని చేశాడో లేదో తెలియదు.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడని పోలీసులు నా భర్తను చంపారు. దీంతో నేనూ, నా బిడ్డ, మా అత్త అనాథలమయ్యాం’’ అని బోరుమంది. మృతదేహాన్ని అడ్డగూడూరుకు పోలీసులు తీసుకురానివ్వకుంటే హన్మకొండలోనే దహన సంస్కారాలు నిర్వహించామని పేర్కొంది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇలానే చేశారా? అని ఆమె ప్రశ్నించారు. తన భర్తకు అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉందని, ఇతర ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. తమ కుటుంబానికి మగ దిక్కు లేకుండా పోయిందని వాపోయారు. ‘‘నేనూ, మా అత్త, 11 నెలల కుమార్తె ఎలా బతకాలి. మా ఇల్లును కూడా ధ్వంసం చేశారు. మేము ఎక్కడ ఉండాలి’’ అని మౌనిక రోదించింది. 

Updated Date - 2021-09-18T00:14:19+05:30 IST