పార్కుల్లో పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2021-10-28T06:05:33+05:30 IST
పార్కులలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు
పార్కుల్లో పనులను వేగవంతం చేయండి
నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
చిట్టినగర్, అక్టోబరు 27: పార్కులలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. బందరు రోడ్డులోని రాఘవయ్యపార్కు, కార్పొరేషన్ కార్యాలయం వెనుక ఉన్న రాజీవ్గాంధీ పార్కులలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులపై అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలన్నారు. రాజీవ్ గాంధీ పార్కులో పనులు పూర్తి చేసి నవంబరు నాటికి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎర్రకట్ట డౌన్, కేదారేశ్వరపేట వద్ద వాకింగ్ ట్రాక్, గ్రీనరీ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, ఎస్ఈ (ప్రాజెక్టు) పి.వి.వి భాస్కరరావు, ఏడీహెచ్ ఏ.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
59వ డివిజన్లో కమిషనర్ పర్యటన
అజిత్సింగ్నగర్: 59వ డివిజన్ అజిత్సింగ్నగర్ రైతుబజార్ రోడ్డు, గుజ్జుల సరళాదేవి కల్యాణ మండపం, రామానగర్ జీప్లస్త్రీ గృహాల్లో ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా, స్థానిక కార్పొరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లాతో కలిసి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం పర్యటించారు.
గుజ్జుల సరళాదేవి కల్యాణ మండపం మరమ్మతులు నిర్వహించి, వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, రామానగర్లో నిలిచిన ఆరోగ్యకేంద్ర భవనాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ వెంటనే అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అదికారులను ఆదేశించారు. పర్యటనలో కమిషనర్ వెంట వివిధ విభాగాల అధికారులు, మైనార్టీ నేతలు ఎండీ రుహుల్లా, షేక్ నాగూల్మీరా, రహమతుల్లా పాల్గొన్నారు.