సిటిజన్‌ ఫ్రెండ్లీ పాలన

ABN , First Publish Date - 2022-01-28T06:18:21+05:30 IST

అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు త్వరగా సేవలు అందించడానికి సిటిజన్‌ ఫ్రెండ్లీ పాలన అందుబాటులోకి తెస్తామని జీఎంసీ నూతన కమిషనర్‌ నిశాంతకుమార్‌ తెలిపారు.

సిటిజన్‌ ఫ్రెండ్లీ పాలన
టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ నిశాంత కుమార్‌

అవినీతిరహితంగా సేవలు అందిస్తా 

ప్రాధాన్య అంశాల పరిష్కారానికి ప్రత్యేక కృషి  

కార్యాలయ పరిశుభ్రతతో క్లీన్‌ గుంటూరుకు శ్రీకారం

బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్‌ నిశాంతకుమార్‌

గుంటూరు(కార్పొరేషన్‌) జనవరి 27: అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు త్వరగా సేవలు అందించడానికి సిటిజన్‌ ఫ్రెండ్లీ పాలన అందుబాటులోకి తెస్తామని జీఎంసీ నూతన కమిషనర్‌ నిశాంతకుమార్‌ తెలిపారు. నగరపాలక సంస్థ 26వ కమిషనర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు.   ప్రజలకు అవినీతిరహిత, స్నేహపూర్వక సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అవినీతి నిర్మూలన, విస్తృత పౌరసేవలు, పారిశుధ్యం మెరుగుదల, డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణ, రోడ్లపై నీరు నిల్వకుండా చేయడం తదితర అంశాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముందస్తు చర్యల ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేస్తామన్నారు. డ్రెయినేజి సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. నగర మేయర్‌, ప్రజా ప్రతినిధులతో కలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి ముందుగా కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతోనే క్లీన్‌ గుంటూరును ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జీఎంసీ ప్రధాన కార్యాలయం అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు.   కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ డీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ డీ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి సీపీలు హిమబిందు, విజయలక్ష్మి తదితరులు   పాల్గొన్నారు. 

కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం 

 నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నిశాంతకుమార్‌ కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. జీఎంసీకి తూర్పు వైపు ద్వారం మూసివేయాలని ఆదేశించారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎటువంటి సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా నిష్పక్షకపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. 


Updated Date - 2022-01-28T06:18:21+05:30 IST