ప్రమాదకరం: యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై నసీరుద్దీన్ షా

ABN , First Publish Date - 2021-09-14T22:25:03+05:30 IST

2017కు ముందు అందరికీ రేషన్ అందేది కాదు. అబ్బా జాన్ అనే వాళ్లు రేషన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. ఖుషినగర్ నుంచి రేషన్ సరుకులు నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలుతున్నాయి...

ప్రమాదకరం: యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై నసీరుద్దీన్ షా

ముంబై: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘అబ్బా జాన్’ అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు దేశ వ్యాప్తమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణించారు. ఇలాంటి వ్యాఖ్యలు విధ్వేషాల్ని మరింత విస్తృతం చేసి అల్లర్లకు కారణమవుతాయని ఆయన అన్నారు. మంగళవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఈ వ్యక్తి (యోగి) ఏంటో అర్థం కాదు. ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాస్తవం ఏంటంటే అబ్బా జాన్ లాంటి విధ్వేషపూరిత మాటలు తరుచూ వదులుతూనే ఉంటారు. యోగి చేసిన ఈ అబ్బా జాన్ అనే మాట ధిక్కారం కిందరకు వస్తుంది. దీనిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని నసీరుద్దీన్ షా అన్నారు. అయితే మత విధ్వేషాలకు ఇలాంటి వ్యాఖ్యలు ఉపకరిస్తున్నాయని, మనుషుల మధ్య అంతరానికి కారణమవుతున్నాయని అన్నారు. హిందువులు కూడా పెద్ద ఎత్తున మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి వాటికి వ్యతిరేకంగా గొంతు పెంచాలని నసీరుద్దీన్ షా అన్నారు.


ఖుషినగర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘‘2017కు ముందు అందరికీ రేషన్ అందేది కాదు. అబ్బా జాన్ అనే వాళ్లు రేషన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. ఖుషినగర్ నుంచి రేషన్ సరుకులు నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలుతున్నాయి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. అక్రమ దారిలో రేషన్ తినేవారిని జైలుకు పంపిస్తున్నాం’’ అని యోగి అన్నారు.

Updated Date - 2021-09-14T22:25:03+05:30 IST