అమరావతిలో.. జడ్జిలు భూములు కొన్నారు
ABN , First Publish Date - 2020-09-19T09:34:44+05:30 IST
న్యాయస్థానాలు, న్యాయమూర్తులను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వారి బిడ్డలు కూడా...
న్యాయమూర్తులకు బాబు ఫ్రీగా స్థలాలిచ్చారు
పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే స్టే తెస్తున్నారు
డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు
పుత్తూరు, సెప్టెంబరు 18: న్యాయస్థానాలు, న్యాయమూర్తులను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో ఎవరెవరు భూకబ్జాలు చేశారనే దానిపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసిందని.. అక్కడ న్యాయమూర్తులు, వారి బిడ్డలు కూడా భూములు కొనుగోలు చేశారని.. దానిపై విచారణను ఏసీబీకి అప్పగించిందన్నారు. దానిపైనా చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, ఆ వివరాలేవీ మీడియాలో రాకూడదంటూ కోర్టు ఆంక్షలు విధించిందని తెలిపారు. స్వతంత్రం రాకముందు కూడా ఈ పరిస్థితి లేదన్నారు. తాను కోర్టులను తప్పు పట్టడం లేదని, ఈ విధమైన ఆదేశాలిచ్చిన న్యాయమూర్తే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా వద్దా..
అమరావతి అంటే ఉన్నవారికేనా..? ఉన్నవారికి భూములు ఫ్రీగా ఇవ్వడం మంచి పద్ధతా అన్నవాటిపై విచారించాలని కోరుతున్నానని చెప్పారు. అమరావతిలో న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్ల స్థలాలిచ్చిన చంద్రబాబు.. రూ.25 లక్షలు చొప్పున కట్టిన ఐఏఎస్ అధికారులకు మాత్రం పంగనామాలు పెట్టారని, ఇపుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల నుంచి స్టేలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బంధువులు.. కావాల్సిన వారు, ఆయన పార్టీ వారు అమరావతిలో భూములు కొనుక్కున్నారని, దీనిపై సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.