పెరటాశి తర్వాతే తిరుమలకు రండి
ABN , First Publish Date - 2022-08-10T09:49:49+05:30 IST
ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు
వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రణాళికబద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా కోరింది. ‘వేసవి రద్దీ తగ్గినప్పటికీ వారాంతపు రద్దీతో పాటు పండుగతో కూడా వరుస సెలవులు ఆగస్టు 19వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాశి మాసం సెప్టెంబరు 18వ తేదీన ప్రారంభమై అక్టోబరు 17వ తేదీన ముగుస్తుంది. ఈమధ్య కాలంలో తిరుమలలో యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. ఈ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తిరుమలకు పెరటాశి మాసం తర్వాత రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ’ అంటూ టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది.