దమ్ముంటే బయటకు రా : ఎస్ఎఫ్జే నేతకు కెప్టెన్ అమరీందర్ సవాల్
ABN , First Publish Date - 2020-08-16T02:33:20+05:30 IST
పంజాబ్లోని మొగా అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్లో ‘ఖలిస్థాన్’ జెండాను ఎగురవేయడంపై ముఖ్యమంత్రి
చండీగఢ్ : పంజాబ్లోని మొగా అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్లో ‘ఖలిస్థాన్’ జెండాను ఎగురవేయడంపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక శక్తుల దుర్మార్గపు ప్రచారానికి లొంగవద్దని పంజాబ్ యువతకు పిలుపునిచ్చారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను వంటివారి బారిన పడవద్దని కోరారు.
మొగా అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్లో ఖలిస్థాన్ జెండాను ఎగురవేసిన ఇద్దరు దుండగులను అత్యంత త్వరగా అరెస్టు చేయాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ దినకర్ గుప్తాను కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు.
ఎస్ఎఫ్జే నేత గుర్పత్వంత్ సింగ్ అంతకుముందు పంజాబీలకు ఓ పిలుపునిచ్చాడు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నల్ల జెండాలను ఎగురవేయాలని కోరాడు.
దీనిపై కెప్టెన్ సింగ్ స్పందిస్తూ, భారత దేశంలోని పంజాబీలు సౌభాగ్యవంతులని, కెనడాలో, అమెరికాలో కూర్చున్నవారి తరపున ఇలాంటి పనులు చేయడానికి పంజాబీలకు ఆసక్తి లేదని అన్నారు.
‘‘వాళ్లు (పంజాబ్ ప్రజలు) ఎందుకు అలా చేయాలి? నీకు దమ్ముంటే రా, ఆ పని చెయ్యి’’ అని పన్నుకు సవాల్ విసిరారు. పన్ను కనీసం ఓ పంజాబీ వ్యక్తి మాదిరిగా ఉండడన్నారు. ఇదంతా డబ్బులు దండుకోవడం కోసమే చేస్తున్నాడన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా పంజాబ్ ప్రజలను అభినందించారు. పంజాబీలు, సిక్కుల సాటిలేని త్యాగాలను, శౌర్యపరాక్రమాలను యావత్తు ప్రపంచం గుర్తించిందని చెప్పారు.