కలెక్టరేట్లో దాహం..దాహం
ABN , First Publish Date - 2022-05-25T06:22:58+05:30 IST
నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంకా పౌర వసతుల సమస్య సందర్శకులను, స్థానిక యంత్రాగాన్ని ఇబ్బందు లకు గరి చేస్తోంది.
సందర్శకులకు తప్పని తిప్పలు
స్పందన రోజున పెరుగుతున్న సందర్శకులు
స్వచ్ఛంద సంస్థలు అందించే నీరే దిక్కు
నీటి వసతి లేని మరుగుదొడ్లు
అపరిశుభ్రంగా దర్శనమిస్తున్న వైనం
భీమవరం, మే 24: నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంకా పౌర వసతుల సమస్య సందర్శకులను, స్థానిక యంత్రాగాన్ని ఇబ్బందు లకు గరి చేస్తోంది. అసలే వేసవి కాలం.. మండుతున్న ఎండలకు తోడు దాహం.. ఈ దప్పిక తీర్చడానికి ఇంకా ఏర్పాటు జరగలేదు. కార్యాలయం ఎదుట స్వచ్ఛంద సంస్థలు మంచినీటి, మజ్జిగ చలివేంద్రాన్ని రెండు వారాల కిందట ప్రారంభించారు. అవి ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ సరిపడినంత నీరులేని పరిస్థితి నెలకొంది. గతంలో శ్రీవిజ్ఞాన వేదిక వారు దాతల సహకారంతో డ్రమ్ములు, మట్టికుండలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి మునిసిపాలిటీ నుంచి నీరు అందకపోవడంతో మూలనపడ్డాయి. దీంతో ముఖ్యంగా సోమవారం నాడు ప్రజా సమస్యల గురించి సుమారు 200 మందికిపైగా సందర్శకులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరికి వారు బాటిళ్లలో నీళ్ళు తెచ్చుకున్నా మధ్యాహ్నానికి సరిపోవడం లేదు. చలివేంద్రంలో కొంత మంది నీరు తాగుతున్నారు. ఇలా అరకొర మంచినీటి వసతి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం మంజూరు చేసిన ఫిల్టర్లు వినియోగంలోకి తీసుకురాలేదు. అలాగే మరుగు దొడ్లలో వసతులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక్కడ నిర్మించిన మరుగుదొడ్లుకు సరైన నీటి వసతి లేదు. శుభ్రపరిచే చర్యలు కూడా లేవని దీంతో తీవ్ర దుర్వాసన వస్తుందని సందర్శకులు వాపోతున్నారు. కొద్ది రోజుల కిందటే బయో టాయిలెట్లు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి ఉంచారు. ఈ టాయిలెట్లను కూడా వినియోగంలోకి తీసుకురావల్సి ఉంది