విశేష స్పందన
ABN , First Publish Date - 2022-07-05T05:00:17+05:30 IST
జిల్లాస్థాయి స్పందన విభాగానికి సోమవారం వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతులందించారు. మొత్తం 353 వినతులు వచ్చినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
కలెక్టరేట్ స్పందనకు వెల్లువెత్తిన వినతులు
కలెక్టరేట్, జూలై 4: జిల్లాస్థాయి స్పందన విభాగానికి సోమవారం వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతులందించారు. మొత్తం 353 వినతులు వచ్చినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ వినతులు స్వీకరించారు. ప్రధానంగా రేషన్కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. సంక్షేమ పథకాలు నిలిపివేశారంటూ చాలామంది ఫిర్యాదుచేశారు. జేసీ ఎం.విజయ సునీత, డీఆర్వో ఎం.రాజేశ్వరి డీఆర్డీఏ పీడీ బి.శాంతిశ్రీ, డీపీవో రవికుమార్, వంశధార ఎస్ఈ డి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పరిష్కారమార్గం చూపండి
స్పందన వినతులకు సకాలంలో పరిష్కారమార్గం చూపాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. స్పందన వినతులపై సమీక్షించారు. వినతులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచకూడదన్నారు.
భూగర్భ జలాల పెంపుతోనే మనుగడ
కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
కలెక్టరేట్, జూలై 4: భూగర్భ జలాల పెంపుతోనే భవిష్యత్ మనుగడ సాధ్యమని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జలశక్తి అభియాన్పై అధికారులు, కేంద్ర కమిటీ సభ్యులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఆదా చేసుకోవాలన్నారు. ఇందుకు చెరువులను పటిష్టం చేయాలన్నారు. మట్టి, పూడికను తొలగించాలన్నారు. గ్రామసభల ఆమోదంతో ప్రజాపయోగ పనులు చేపడుతున్నట్టు కలెక్టర్ వివరించారు. గ్రామసభ తీర్మానం జరిగిన తరువాతే ఉపాధి హామీ పనులు జరుగుతాయని చెప్పారు. అమృత్ సరోవర్ పథకంలో భాగంగా 71 పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ బి.లక్ష్మీపతి, వంశధార ఎస్ఈ డి.తిరుమలరావు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రసాదరావు పాల్గొన్నారు.