భూసేకరణ ప్రాజెక్టుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-03-07T05:53:21+05:30 IST
జిల్లాలో ప్రాజెక్టులకు నిర్దేశించిన సమయంలో భూసేకరణ చేయడంలో అలసత్వం వహించే అధికారులపై కఠినచర్యలు చేపడతామని కలెక్టర్ వివేక్యాదవ్ హెచ్చరించారు.
కలెక్టర్ వివేక్యాదవ్ హెచ్చరిక
గుంటూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాజెక్టులకు నిర్దేశించిన సమయంలో భూసేకరణ చేయడంలో అలసత్వం వహించే అధికారులపై కఠినచర్యలు చేపడతామని కలెక్టర్ వివేక్యాదవ్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గుంటూరు - గుంతకల్లు రైల్వే డబ్లింగ్, వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు భూసేకరణ అంశాలపై సమీక్షించారు. అలానే పేదలందరికి ఇళ్ల పథకం, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణం, మన బడి నాడు - నేడు అభివృద్ధి పనులు, ఉపాధి హామీ, ఏపీ అమూల్ ప్రాజెక్టు, సచివాలయాల ద్వారా అందించే సేవలు, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. భూసేకరణపై పురోగతి లేకపోతే సంబంధిత ఆర్డీవో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేసీ ఏఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్వెల్నెస్ సెంటర్లకు ఇప్పటికీ భూముల లభ్యతపై మార్చి 8వ తేదీ నాటికి పూర్తి నివేదిక అందించాలన్నారు. ఏపీ అమూల్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా సంబంధిత గ్రామాలలో పాడి రైతుల రిజిస్ట్రేషన్, ఆటో మిల్క్ కలెక్షన్ సెంటర్ల గుర్తింపు, మిషనరీ ఏర్పాటు పనులు మార్చి 12వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జేసీ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో మనబడి నాడు - నేడు అభివృద్ధి పనుల రీఎస్టిమేషన్ల ప్రతిపాదనలకు అనుమతులు తీసుకొని వెంటనే ఆన్లైన్లో అప్లోడింగ్ చేయాలన్నారు. సమావేశంలో జేసీ(ఆసర) శ్రీధర్రెడ్డి, జడ్పీ సీఈవో ఛైతన్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఏ పీడీ ఆనంద్నాయక్, పశుసంవర్థక శాఖ జేడీ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.