ఇళ్ల స్థలాలను తక్షణం పూడ్చండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-24T05:39:06+05:30 IST

ఇళ్ల స్థలాలు పల్లంగా ఉండడంతో లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రావడంలేదని, తక్షణమే లెవెలింగ్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

ఇళ్ల స్థలాలను తక్షణం పూడ్చండి : కలెక్టర్‌
వడ్డిలంకలో ఇళ్ల స్థలాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

యలమంచిలి, మే 23: ఇళ్ల స్థలాలు పల్లంగా ఉండడంతో లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రావడంలేదని, తక్షణమే లెవెలింగ్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మండలంలోని వడ్డిలంక, కాంబోట్లపాలెం జగనన్న కాలనీల్లో లేఅవుట్‌లను కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. వేసవిలో నిర్మాణ పనులు వేగంగా చేసి, మెరక చేస్తే లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందుకు వస్తారని, కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా సిమెంట్‌, ఐరన్‌, నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తోందని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇది ఇంటి నిర్మాణానికి అనుకూలమైన సమయం కాబట్టి తక్షణమే నిర్మించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట హౌసింగ్‌ డీఈ ఆర్‌.త్రిమూర్తులు, తహసీల్దార్‌ ఎల్‌.నరసింహారావు, ఎంపీడీవో సీహెచ్‌.త్రిశూలపాణి, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:39:06+05:30 IST