అందరికీ పథకాలు అందాలి
ABN , First Publish Date - 2020-10-23T10:46:19+05:30 IST
జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా వంటి సంక్షేమ పథకాలు పేదలందరికీ అందేలా చూడాలని జిల్లా అధికారులు, బ్యాంకర్లకు కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
అర్హులైన వారికి రుణాలివ్వాలి
టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా వంటి సంక్షేమ పథకాలు పేదలందరికీ అందేలా చూడాలని జిల్లా అధికారులు, బ్యాంకర్లకు కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా పథకాలపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) రామ్సుందర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, డీఆర్డీఏ, మెప్పా పీడీలు శ్రీనివాసులు, శిరీష, ఎంపీడీవోలు, బ్యాంకుల మేనేజర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా పథకాల అప్లికేషన్లను సీరియస్గా తీసుకోవాలన్నారు. వాటిని వెంటనే బ్యాంకర్లకు పంపాల న్నారు. సంక్షేమ పథకాల దరఖాస్తులు బ్యాంకర్లకు అందజేయడం, అప్లోడ్ చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారని, అధికారులు ఈ సమస్య పరిష్కరించాలని అన్నారు.
వైఎస్సార్ బీమా పథకం జనధన్ అకౌంట్ ఓపెనింగ్ మొదలైన వాటిపై బ్యాంకు మేనేజర్లు, అధికారులు మేళా ఏర్పాటు చేయాలన్నారు. కొంతమంది అధికారులు తమ దగ్గర డేటా లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. ఇప్పటికే చాలామంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని, కానీ బ్యాంకర్లు నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్నా రని అన్నారు. అర్హులైన వారికి జగనన్నతోడు పథకం కింద రుణం మంజూరు చేయాలన్నారు. వైఎస్సార్ బీమా పథకానికి బ్యాంకు అకౌంట్లు లేని వారందరూ జన్ధన్ ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.