ఆశా పవనాలు
ABN , First Publish Date - 2020-06-05T11:03:42+05:30 IST
ఈ సంవత్సరం రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు.
ముందుగానే నైరుతి
వ్యవసాయాన్ని లాభసాటి చేయండి
కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 4: ఈ సంవత్సరం రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వ్యవసాయశాఖ యంత్రాంగానికి ఖరీఫ్ సాగుపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవిపట్టన్శెట్టి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, వ్యవసాయశాఖ జేడీ విల్సన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తు న్నాయని తెలిపారు. కాబట్టి జిల్లాలో వర్షాలు జూన్లోనే మొదలవుతాయని తెలిపారు. వ్యవసాయశాఖ యంత్రాం గం, శాస్త్రవేత్తలు ఈ అవకాశాన్ని రైతులకు అనుకూలంగా మార్చి లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి మంచి వర్షాలు జిల్లాలో పడనున్నాయని, పంట ఉత్పత్తులపై సమగ్ర ప్రణాళికను రూపొందించి రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశించారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు వ్యవసాయ, అనుబంధ ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రైతులను లాభాలబాట పట్టించేలా కృషి చేయాలని అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు అలవాటు చేయా లని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామస్థాయిలో నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్లుగా ఉపయోగపడాలన్నారు.