కొవ్వూరు ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ సీరియస్
ABN , First Publish Date - 2022-09-29T06:15:10+05:30 IST
కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది పని తీరుపై కలెక్టర్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు ఉన్నా విని యోగంలోకి తీసుకురాకపోవడంపై మండిపడ్డారు.
రోగులను ప్రైవేట్ ల్యాబ్లకు పంపడంపై నిలదీత
పారిశుధ్యం అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం
రికార్డుల నిర్వహణపై అసంతృప్తి
నిధులున్నా వసతుల లేమిపై మండిపాటు
సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ హుకుం
కొవ్వూరు, సెప్టెంబరు 28 : కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది పని తీరుపై కలెక్టర్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు ఉన్నా విని యోగంలోకి తీసుకురాకపోవడంపై మండిపడ్డారు. కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సరిగా స్పందించడం లేదు, వసతులను వినియోగించడం లేదు, ల్యాబ్ టెస్టులకు బయటకు సిఫారసు చేస్తున్నారనిహోం మంత్రి తానేటి వనిత, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీ చేశాన న్నారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు.రోగులను డాక్టర్లు బయట ల్యాబ్లకు రిఫర్ చేస్తున్నారని ప్రిస్కిప్షన్ పుస్తకాలతో సహ గుర్తించడం జరిగిందన్నారు. నిధులు ఉన్నప్పటికి మరుగు దొడ్లు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు నిర్వహణ సక్రమంగా లేవన్నారు. నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తులో అన్ని సదుపాయాలు, రూమ్లు బెడ్లు, ఐసీయూ అన్ని అం దుబాటులో ఉన్నా వైద్యులు వినియోగంలోకి తేవడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు.ఆసుపత్రిలో రికార్డులను సరిగా నిర్వహించక పోవడంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. కొవ్వూరు ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు, బయట ల్యాబ్లతో వైద్యుల ఒప్పందాలు, మం దుల వినియోగం, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర నివేదికను అందజేయాలని డీసీహెచ్ఎస్ డా.ఎమ్.సనత్కుమారి, కొవ్వూరు ఆర్డీవో ఎస్.మల్లిబాబులను ఆదేశించారు. కరోనా సమయంలో రోగుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు నిరుపయోగంగా మార్చడంపై మండిపడ్డారు. రెండు వారాల్లో మరలా ఆసుపత్రిని ఆక స్మిక తనిఖీ చేస్తానని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మీకు చేతకా కపోతే తప్పుకోండి.. కనీసం ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా లేకపోతే ఎలా అని మండిపడ్డారు. వైద్యులు, వైద్య సిబ్బంది అటెండెన్స్, మందుల నిర్వహణ రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో నిర్వహణ ఏజన్సీ నుంచి వివరణ కోరడంతో పాటు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కాంట్రాక్టరును మార్పుచేయాలన్నారు.ఆమె వెంట తహశీల్దార్ బి.నాగరాజు నాయక్ ఉన్నారు.