అనుమతి లేకుండా కొవిడ్ పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరిక
ABN , First Publish Date - 2020-09-28T19:55:42+05:30 IST
అనుమతులు లేకుండా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..
ఒంగోలు: అనుమతులు లేకుండా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సంస్థలు, వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇళ్లకు వెళ్లి ప్రజల వద్ద అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు, తప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయని పేర్కొన్నారు. ఇలా చేయడం చట్ట రీత్యా నేరమని, అటువంటి వారిపై ఇప్పటికే వివిధ రూపాల్లో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.