విస్సన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ
ABN , First Publish Date - 2021-10-23T05:14:46+05:30 IST
విస్సన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ
ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్.. మరో ఇద్దరికి షోకాజ్ జారీచేసిన కలెక్టర్
విస్సన్నపేట, అక్టోబరు 22 : విస్సన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీతో ఉద్యోగులు, సిబ్బంది పనులు చేస్తున్నట్లు నటించారు. డ్యూటీ డాక్టర్ హేలినాను ఆసుపత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ యు.రమేశ్, మత్తు వైద్యుడు విజయబాబు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు గైర్హాజరైన హెడ్ నర్సు మణికుమారి, సీనియర్ అసిస్టెంట్ ఏసుకృపను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఇద్దరు ఉద్యోగినులూ ఎలాంటి లీవ్ లెటర్లు ఇవ్వలేదు. సూపరింటెండెంట్ యు.రమేశ్ తరచూ విధులకు గైర్హాజరవుతుంటారు. గురువారం నాటి సెలవుపై కలెక్టర్ డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి విచారించగా, ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. దీంతో సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.