ఉత్తమ పౌరులుగా ఎదగాలి
ABN , First Publish Date - 2022-08-10T06:30:35+05:30 IST
అనాథ బాలలను అక్కున చేర్చుకుని ఆదరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు.
ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్లో క్రికెట్ ఆడిన కలెక్టర్ దిల్లీరావు
భవానీపురం, ఆగస్టు 9 : అనాథ బాలలను అక్కున చేర్చుకుని ఆదరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. భవానీపురంలో ప్రేమ్ విహార్ ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్లో ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాలలకు మంగళవారం కంటి పరీక్షలు జరిగాయి. కలెక్టర్ దిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరై బాలలతో కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారాలను అందిపుచ్చుకుని ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా అనాథ బాలల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కంటి పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ బాలలతో కలిసి భోజనం చేశారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం, కార్యదర్శి ఇళ్లా రవి, చిల్డ్రన్ ట్రస్ట్ చీఫ్ కో-ఆర్డినేటర్ కె. చంద్ర, వార్డెన్ వెస్లీ పాల్గొన్నారు.