ఇళ్ల నిర్మాణం పూర్తయితే మౌలిక వసతులు
ABN , First Publish Date - 2022-07-07T06:00:30+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయిన వెంటనే రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామని కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు.
ఆత్మకూరులో జగనన్న కాలనీ తనిఖీలో కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి
మంగళగిరి, జూలై 6: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయిన వెంటనే రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామని కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. మంగళగిరినగర పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో జగనన్న కాలనీ, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, రైతు భరోసా కేంద్రం, సచివాలయాలను బుధవారం ఆయన సందర్శించారు. జగనన్న కాలనీవాసులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కాలనీలో వలంటీర్ల ద్వారా రేషన్, పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్ధాలను పరిశీలించారు. జడ్పీహైస్కూల్లో నాడు-నేడు ఫేజ్-2 కింద నిర్మితమవుతున్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో కియోస్కి, పంపిణీకి సిద్ధంగా వుంచిన విత్తనాలను పరిశీలించారు. కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయడంతో పాటు వారికి బ్యాంకర్లు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర భూసర్వే జరుగుతున్న నేపథ్యంలో సర్వేయర్, వీఆర్వోలు సచివాలయం పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాల రిజిస్టరును పక్కాగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సాయినాథ్కుమార్, ప్రత్యేకాధికారి రాంబాబు, తహసీల్దారు రామ్ప్రసాద్, ఎంపీడీవో రామ్ ప్రసన్న, ఇన్చార్జి సీడీపీవో నూరానీ, ఎంఈవో ఎం.లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ ఏవో శైలజ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.