ఇళ్ల నిర్మాణంపై సచివాలయాలకు వారం టార్గెట్లు : కలెక్టర్
ABN , First Publish Date - 2022-05-25T06:20:13+05:30 IST
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. ప్రతి వారం పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు.
రాజమహేంద్రవరం,మే 24(ఆంధ్రజ్యోతి) : ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. ప్రతి వారం పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికా రులతో ఓటీఎస్, ఇళ్ల నిర్మాణాలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి 15 రోజులకొకసారి సీఎం జగన్ స్వయంగా సమీక్షిస్తారని, ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు.ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవో పర్యటించి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి వారం వార్డు సచివాలయం పరిధిలో 10, గ్రామ సచివాలయం పరిధిలో 5 ఇళ్ల పనులు ప్రారంభించాలన్నారు. కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని లేఅవుట్లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ మల్లిబాబు ఆదేశించారు. నిడదవోలులో 990 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కేవలం 58 మాత్రమే ఎందుకు ప్రారంభమయ్యాయని, మిగతా వాటి సంగతేంటని ప్రశ్నించారు. సమావేశంలో జేసీ శ్రీధర్, కమిషనర్ కె.దినేష్కుమార్,ఆర్డీవోలు ఎ.చైత్రవర్షిణి, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.