పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
ABN , First Publish Date - 2020-06-04T11:00:22+05:30 IST
పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాలు తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మురళీధర్రెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ మురళీధర్రెడ్డి
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 3: పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాలు తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని వెంకటనగరం గ్రామంలో ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంబించారు. జడ్పీ సీఈవో ఎం.జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిరక్షించుకుంటూ పరిశుభ్రతపై దృష్టి పెట్టి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. గ్రీన్ అంబాసిడర్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు.
ఈ పథకంలో భాగంగా ప్రతీ కుటుంబం నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 వసూలు చేస్తామని, ఆ సొమ్మును గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్గార్డులకు అందజేయడంతో పాటు చెత్త రవాణా చేసే వాహనాల నిర్వహణకు ఉపయోగిస్తామన్నారు. వైసీపీ నేత ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలని కోరారు. మాజీ సర్పంచ్ ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ రూ.1.05 లక్షల చెక్కును కలెక్టర్కు అందజేశారు. పారిశుద్య కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. గ్రామ వలంటరీ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఆరా తీశారు. కాగా వెంకటనగరం గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని రైతులు, ఉపాధి కూలీలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డీఆర్డీఏ పీడీ ఎ.హరిహరనాథ్, డీపీవో నాగేశ్వర నాయక్, ఎంపీడీవో సుభాషిణి, గ్రామ ప్రత్యేకాధికారి దిలీప్కుమార్, డీఎల్పీవో సత్తిబాబు, తహసీల్దారు రియాజ్ హుస్సేన్, గ్రామ కార్యదర్శి కె.స్టీఫెన్ పాల్గొన్నారు.