సమరయోధుల త్యాగాలు మరువ లేనివి...
ABN , First Publish Date - 2022-08-11T05:20:22+05:30 IST
సమరయోధుల త్యాగాలు మరువ లేనివి...
జిల్లాలో 3.43 లక్షల ఇళ్లపై జాతీయ జెండాల ఎగరవేత
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
భీమదేవరపల్లి, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలోని 3.43 లక్షల ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయనుండగా, ఇప్పటికే 1.60 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశామన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 22 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్లు మొక్కలు నాటారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని కలెక్టర్ సూచించారు.
త్యాగాలు మరవలేనివి.
దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ నెల 22వరకు జిల్లాలోని సినిమా థియేటర్లలో ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు గాంధీ సినిమాను విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, డీఆర్డీవో శ్రీనివా్సకుమార్, ఎంపీపీ జక్కుల అనిత-రమేష్, జడ్పీటీసీ వంగ రవి, తహసీల్దార్ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.