తక్షణమే ఇళ్ల నిర్మాణానికి చర్యలు
ABN , First Publish Date - 2021-01-21T05:02:25+05:30 IST
లే అవుట్లలో లబ్ధిదారులు తక్షణమే గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు.
23వ తేదీకి పట్టాలు పంపిణీ పూర్తవ్వాలి
నిర్మాణాలకు సచివాలయ సిబ్బంది సేవలు
కలెక్టర్ రేవు ముత్యాలరాజు
ఏలూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): లే అవుట్లలో లబ్ధిదారులు తక్షణమే గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన తహసీల్దారులు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీనాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. కొత్త లే అవుట్ కాలనీల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను గృహ నిర్మాణాలకు వినియోగించాలని అన్నారు. నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా మండల, డివిజన్ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గృహనిర్మాణాలు త్వరిత గతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో ప్రతి లబ్ధ్దిదారుని మ్యాపింగ్ పూర్తి కావాలని, వివరాలను గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీసీలో జేసీలు హిమాంశు శుక్లా, నంబూరి తేజ్ భరత్, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.