ఇరిగేషన్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2021-07-27T05:51:40+05:30 IST

ఇరిగేషన్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారుల నిర్వాహకంపై నిలదీశారు.

ఇరిగేషన్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి
అధికారులను ప్రశ్నిస్తున్న జిల్లా కలెక్టర్‌

నిర్మల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి)  : ఇరిగేషన్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారుల నిర్వాహకంపై నిలదీశారు. స్వర్ణప్రాజెక్ట్‌కు సంబంధించి నీటివిడుదల సమాచారాన్ని తనకు తెలుపకపోవడం సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ ఈఈ రామరావును ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. కడెంప్రాజెక్ట్‌, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనకు ప్రాజెక్ట్‌కు సంబందించిన అన్ని అంశాల సమాచారాన్ని అందించారని అయితే స్వర్ణప్రాజెక్ట్‌ అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో విసృతంగా ప్రచారం చేయాల్సిందని, అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఉండాల్సిందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. సమాచార లోపం కారణంగా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి సమక్షంలోనే కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారులను నిర్లక్ష్యం విషయంలో నిలదీశారు. మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుం డా చూడాలంటూ కలెక్టర్‌ ఆదేశించారు. అయితే ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల మాదిరిగా ఎగువ నుంచి వచ్చే వరద సమాచారం తమకు తెలియదని దీని కారణంగానే దిగువకు నీటిని విడుదల చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇరిగేషన్‌ ఈఈ రామారావు తెలిపారు.

Updated Date - 2021-07-27T05:51:40+05:30 IST