కలెక్టర్, కమిషనర్ మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ పరిశీలన
ABN , First Publish Date - 2021-12-03T06:24:31+05:30 IST
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రిజర్వాయర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు.
గోపాలపట్నం, డిసెంబరు 2: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రిజర్వాయర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాతో కలిసి ఆయన గురువారం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ను పరిశీలించారు. రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో తుఫాన్ ప్రభావం వల్ల వరదనీటి ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. రిజర్వాయర్ స్థితిగతులపై అధికారులను ఆరా తీశారు. రిజర్వాయర్ రెండు గేట్లు సక్రమంగా పనిచేయడం లేదని, కాలువ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల వరదనీరు సక్రమంగా ప్రవహించే దారిలేక లోతట్టు ప్రాంతాల్లో ముంపు సంభవిస్తోందని కలెక్టర్కు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో వర్షం కురిస్తే రిజర్వాయర్ ఇన్ఫ్లో పెరిగి ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందు జాగ్రత్త చర్యగా రిజర్వాయర్ గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రిజర్వాయర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.