అప్రమత్తంగా ఉన్నాం!

ABN , First Publish Date - 2020-11-25T06:45:14+05:30 IST

‘నివర్‌’ తుపాను కారణంగా రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం తీసుకుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

అప్రమత్తంగా ఉన్నాం!
సీఎం జగన్‌తో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ సిటీ : ‘నివర్‌’ తుపాను కారణంగా రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం తీసుకుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. మంగళవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌కు తన క్యాంపు కార్యాలయంలో నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ.కె.మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తీసు కున్న ముందస్తు చర్యలను సీఎంకు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు  వ్యవసాయ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులంతా అప్రమత్తంగా ఉం డేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ఆదేశించామ న్నారు. ఈ నెల 25, 26న అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, పంట నష్టం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సీఎంకు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-25T06:45:14+05:30 IST