లేఅవుట్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసే చర్యలు
ABN , First Publish Date - 2020-12-06T04:33:56+05:30 IST
పేదలందరికి ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలాల పంపిణీకి అనుగుణంగా లేఅవుట్లు సిద్ధం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకొంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ హెచ్చరించారు.
కలెక్టర్ ఆనంద్కుమార్
గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలాల పంపిణీకి అనుగుణంగా లేఅవుట్లు సిద్ధం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకొంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్తో పాటు నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపుర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు హాజరయ్యారు. మండలాల వారీగా అభివృద్ధి చేసిన లేఅవుట్ ఫోటోలను కలెక్టర్ పరిశీలించి సూచనలు జారీ చేశారు. లేఅవుట్ పనులు సక్రమంగా నిర్వహించని మండల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లాపల్లి మండలం ఎంపీడీవోకు ఛార్జ్మెమో జారీ చేయాల్సిందిగా డీఆర్వోని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖర్రెడ్డి, జడ్పీ సీఈవో చైతన్య పాల్గొన్నారు.
50 రోజలు కొవిడ్పై అవగాహన కార్యక్రమాలు
కొవిడ్-19పై నిర్వహిస్తున్న 50 రోజుల అవగాహన కార్యక్రమాలను నిర్దేశించిన విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కొవిడ్-19పై అవగాహన కార్యక్రమాల నిర్వహణ, స్పందన, గ్రామ, వార్డు సచివాలయాల అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి పాత పోర్టల్లో పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. జేసీ ఏఎస్ దినేష్కుమార్, జేసీ(సచివాలయాలు)పి.ప్రశాంతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలు, వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మీరు అందించే ఈ సహాయం దేశ రక్షణలో అశువులు బాసిన వీరజవాన్ల కుటుంబాల సంక్షేమం, పునరావాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.