యూపీఎస్సీ పరీక్షలను విజయవంతం చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-10-02T08:15:27+05:30 IST
నగరం లో అక్టోబర్ 4న యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను అధికారులు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 1 (ఆంధ్రజ్యోతి): నగరం లో అక్టోబర్ 4న యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 99 కేంద్రాల్లో 46,171 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు.
ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లతో పరీక్షలుంటాయన్నారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతోపాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్లను వినియోగించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇన్విజిలేటర్లు గుర్తించి సెంటర్ సూపర్వైజర్ దృష్టికి తీసుకురావాలన్నారు. గంట ముం దుగా పరీక్షా కేంద్రాలకు రావాలన్నారు. సమావేశంలో అండర్ సెక్రటరీ మనోజ్కుమార్ శర్మ, ప్రైవేట్ సెక్రెటరీ సంజయ్కుమార్ పాల్గొన్నారు.