మానుకోట అభివృద్ధికి సహకరించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-05-29T11:15:56+05:30 IST
మహబూబాబాద్ పట్టణాభివృద్ధికి ప్రతీ ఒక్క రు సహకరించాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు.
మహబూబాబాద్ టౌన్, మే 28 : మహబూబాబాద్ పట్టణాభివృద్ధికి ప్రతీ ఒక్క రు సహకరించాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు. మహబూబాబాద్లో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డితో కలిసి గురువారం పట్టణంలో పర్యటించారు. గంటకుపైగా ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ రోడ్డు వెడల్పుపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన వీధుల్లోని రోడ్లను వెడల్పు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రోడ్ల వెడల్పు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కేసముద్రం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ సూచించారు. కేసముద్రం పీహెచ్సీని ఆయన గురువారం తనిఖీ చేశారు. అనంతరం కల్వలలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు పనులు పరిశీలించారు.