ఫీవర్ సర్వేను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-05-16T05:54:39+05:30 IST
జిల్లాలో కొవిడ్ 19 ఫీవర్ సర్వేను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ వివేక్యాదవ్ అదేశించారు.
కలెక్టర్ వివేక్ యాదవ్
గుంటూరు, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ 19 ఫీవర్ సర్వేను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ వివేక్యాదవ్ అదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన కొవిడ్ -19 నివారణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సబ్కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల డివిజన్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన ఫిర్యాదులను త్వరితగతిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో మాట్లాడిన కలెక్టర్... వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణలకు సంబంధించిన పనులు, జలజీవన్ మిషన్ పనులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న తీరు, జిల్లాలో కొవిడ్ ఫీవర్ సర్వే జరుగుతున్న తీరు తదితర అంశాలపై సమీక్షించారు. రెవెన్యూకు సంబంధించి ఆర్ఓఆర్లు, ఎంట్రీలు, అడంగళ్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, ల్యాండ్ డ్రాప్టింగ్, మీసేవ ఇంటి స్థలాలు, పింఛన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి సమస్యలు తరచూ వస్తున్నాయన్నారు. వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుంలడా చూడాలన్నారు. పాజిటివ్ సోకిన వారికి తగిన రీతిలో అత్యవసర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఏస్ దినేష్ కుమార్, జేసీ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి,జేసీ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ బన్సాల్, రెవెన్యూ అధికారి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.