ఆర్టీసీలో ఎన్నికల కోసం సంతకాల సేకరణ: టీజేఎంయూ
ABN , First Publish Date - 2022-01-25T07:14:58+05:30 IST
తెలంగాణ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరపాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో
హైదరాబాద్ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరపాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలంగాణ జాతీ య మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ప్రకటించారు. ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి వెంటనే ఎన్నికలు జరపాలని లేబర్ కమిషనర్, ఎండీలను కోరారు. నగరంలో సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఆర్టీసీలో రెండు వేతన సవరణలు జరగలేదని, 6 డీఏలు ప్రకటించకుండా, ఉద్యోగులతో చట్టవ్యతిరేకంగా 16 గంటలు డ్యూటీలు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డిపో ట్రాన్స్ఫర్, సస్పెన్షన్, తొలగిస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాల్సిన అవసరముందని అన్నారు.