‘అమూల్కి విజయ డెయిరీని అప్పగించడం దారుణం’
ABN , First Publish Date - 2020-12-03T05:28:50+05:30 IST
విజయ డెయిరీని పునఃప్రారంభించాలని ఈదల నిరసన
చిత్తూరు సిటీ, డిసెంబరు 2: విజయ డెయిరీని పునఃప్రారంభించకుండా, అమూల్ సంస్థతో ప్రభుత్వం పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమని శాంతియుత ఉద్యమ నేత, జిల్లా పాడిరైతు సంఘం నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు విమర్శించారు. బుధవారం నగరంలోని విజయ డెయిరీ వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాచలం మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ అధికారంలోకి రాగానే విజయ డెయిరీని, చిత్తూరు, గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ విషయం విస్మరించి గుజరాత్కు చెందిన అమూల్ సంస్థతో పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడం అన్యాయమని మండిపడ్డారు. జిల్లా పాడిరైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.