లక్షణాలకు అనుగుణంగా బెడ్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2021-05-13T06:08:30+05:30 IST
జీజీహెచ్కు వస్తున్న కొవిడ్ బాధితులను పూర్తిగా ట్రైఏజ్ చేసి లక్షణాలకు అనుగుణంగా బెడ్లు కేటాయించాలని కలెక్టర్ వివేక్యాదవ్ ఆదేశించారు.
వార్డుల్లో అనధికార వ్యక్తులు ఉంటే చర్యలు
జీజీహెచ్ సమీక్షలో కలెక్టర్ వివేక్యాదవ్ ఆదేశాలు
గుంటూరు(తూర్పు), మే 12: జీజీహెచ్కు వస్తున్న కొవిడ్ బాధితులను పూర్తిగా ట్రైఏజ్ చేసి లక్షణాలకు అనుగుణంగా బెడ్లు కేటాయించాలని కలెక్టర్ వివేక్యాదవ్ ఆదేశించారు. జీజీహెచ్లో కొవిడ్ వైద్య సేవలపై బుధవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో రోజువారి అడ్మిషన్లు, డిశ్చార్జిల నిర్వహణకు ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించాలన్నారు. వార్డుల్లో ఉన్న కొవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన వైద్య సేవలపై ప్రతిరోజు నివేదిక అందించాలన్నారు. ఆక్సిజన్ నిర్వహణకు ప్రత్యేకంగా ఒక అధికారికి, ఆక్సిజన్ పర్యవేక్షణకు వార్డుకు ఒక నర్సుకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, ప్రెజర్, పైపులైను లీకేజీలను బయో మెడికల్ ఇంజనీర్లతో తనిఖీలు చేయించాలన్నారు. కోలుకున్న వారిని స్టెప్ డౌన్ సెంటర్లకు తరలించి వైద్యసేవలు అందించాలన్నారు. వార్డుల్లోకి అనధికార వ్యక్తులు రాకపోకలు సాగించకుండా నియంత్రించాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, ట్రైనీ కలెక్టర్ శుభం భన్సాల్, డీఆర్వో కొండయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.
జగనన్న కాలనీల్లో పనులు వేగవంతం చేయాలి
జిల్లాలోని జగనన్న కాలనీల్లో శాశ్వాత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ సమావేశమందిరంలో జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తొలి విడతలో గృహ నిర్మాణాలు ప్రారంభించిన 584 లే అవుట్లలో శాశ్వత మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. కాలనీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి అన్ని శాఖలు మే25 నాటికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు గృహ నిర్మాణశాఖకు అందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కొండయ్య, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, ఆర్డబ్య్లూఎస్ ఎస్ఈ సురేష్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈలు శ్రీనివాసరావు, సాంబయ్య, విద్యుత్ సీఆర్డీఎ సర్కిల్ డీఈ శ్రీనివాస్, ఏపీ ఫైబర్ సీనియర్ మేనేజర్ హైమారావు తదితరులు పాల్గొన్నారు.