ఈసీకి సహకరించండి
ABN , First Publish Date - 2021-01-24T08:07:44+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్కు జగన్ ప్రభుత్వం సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ సూచన
తిరుపతి(ఆటోనగర్), జనవరి 23: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్కు జగన్ ప్రభుత్వం సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. తిరుపతిలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పును గౌరవించాల్సింది పోయి కరోనా సాకుతో సుప్రీంకోర్టుకు వెళతామనడం విడ్డూరంగా ఉందన్నారు.ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు.ప్రభుత్వ యంత్రాంగం కూడా విజ్ఞతతో వ్యవహరించి ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవాలని కోరారు. గత ఏడాది ఆగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావడంలో అధికార పార్టీ హస్తం వుందని తప్పుబట్టారు. వాటిని రద్దు చేసి తాజా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. గతంలో ఆరోపణలను ఎదుర్కొన్న అధికారులను బదిలీ చేసి పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.