విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్?
ABN , First Publish Date - 2021-10-11T18:10:34+05:30 IST
విద్యుత్ సంక్షోభం ముదురుతోందా? ఆంధ్రప్రదేశ్లో అంధకారం అలుముకోనుందా?.. అంటే..
విజయవాడ: విద్యుత్ సంక్షోభం ముదురుతోందా? ఆంధ్రప్రదేశ్లో అంధకారం అలుముకోనుందా?.. అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా థర్మల్ ప్లాంట్లు మూతపడే స్థతికి చేరుకున్నాయి. విజయవాడ సమీపంలోని ఏకైక థర్మల్ ప్లాంట్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. సరిపడ నిల్వలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించారు. దీంతో విద్యుత్ కోతలకు రంగం సిద్ధమైనట్లేనని చర్చ జరుగుతోంది.
అప్పు చెల్లించకపోవడంతో ఏపీలో విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. హైడల్ పవర్తో పాటు ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న 15 వందల మెగావాట్లు.., బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్తో ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కరోనా కారణంగా గృహ విద్యుత్ వినియోగం పెరుగుతూ వచ్చింది. గతంలో రోజుకు 170 మిలియన్ యూనిట్లు అవసరం కాగా.. ఇప్పుడు 190 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయాలంటే థర్మల్ విద్యుత్ మినహా ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది. థర్మల్ విద్యుత్కు సంబంధించి ఇప్పటికే రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఉత్పాదన ఖర్చు అధికంగా ఉందన్న కారణంతో ఈ రెండు ప్లాంట్లను మూసివేశారు. ఒక్క విజయవాడకు సమీపంలోని ఎన్టీటీపీఎస్లో మాత్రమే ఉత్పాదన జరుగుతోంది.