కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్‌ లేఖ

ABN , First Publish Date - 2020-10-18T01:51:04+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్‌ లేఖ

అమరావతి : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి సీఎం లేఖ రాశారు. లేఖలో పలు విషయాలను జగన్ ప్రస్తావించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని.. తక్షణమే రూ.2250 కోట్ల ఆర్థికసాయం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపాలని లేఖలో కోరారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.


భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైందని.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని షాకు రాసిన లేఖలో జగన్ తెలిపారు. ఇప్పటికే ఏపీలో కరోనా మహమ్మారితో ఆర్థికంగా నష్టపోయి ఉన్నామని.. ఇప్పుడు దీనికి తోడు ఈ వర్షాలు, వరదలు తోడవ్వడంతో పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయని జగన్ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం అండ, చేయూత ఎంతో అవసరమని షాకు రాసిన లేఖలో జగన్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-18T01:51:04+05:30 IST