పంద్రాగస్టు సందేశంలో మూడు రాజధానులపై జగన్ ఇలా..

ABN , First Publish Date - 2020-08-15T15:44:10+05:30 IST

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌‌లో పెద్ద రగడే జరుగుతున్న విషయం విదితమే.

పంద్రాగస్టు సందేశంలో మూడు రాజధానులపై జగన్ ఇలా..

అమరావతి : మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌‌లో పెద్ద రగడే జరుగుతున్న విషయం విదితమే. అయితే అప్పట్లో అసెంబ్లీలో.. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత జగన్ ఎక్కడా నేరుగా మాట్లాడలేదు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నేతలు ఈ విషయంపై పదే పదే మాట్లాడారు. పంద్రాగస్టు సందర్భంగా సీఎం జగన్ ‘మూడు రాజధానులు’ ప్రస్తావన తెచ్చారు.


త్వరలో విశాఖ, కర్నూలు‌లో పునాదులు 

ఇవాళ విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ శకటాలను సీఎం వీక్షించారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో వైద్య, ఆరోగ్య సేవలపై శకటాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన పాదాభివందనం చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన.. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, అలాంటి గాయాలు మరల తగలకూడదన్నా రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైనదని నిర్ణయించామని జగన్ మరోసారి స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లులను చట్టంగా మార్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగన్ తెలిపారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

Updated Date - 2020-08-15T15:44:10+05:30 IST