మహిళలకు 51 శాతం పదవులిచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ: సీఎం జగన్
ABN , First Publish Date - 2022-03-08T19:41:27+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పారు. ఆధునిక ఏపీలో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులేనన్నారు. ఇక్కడ మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయన్నారు. ‘‘మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలరు... అని ఐన్రైన్డ్ అన్నారని’’ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ తన ముందున్నవారిలో 99 శాతం మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారని, భారతదేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజా ప్రతినిధుల సమావేశం ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు. 1993 నుంచీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్కు పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారని, మహిళలకు 51శాతం పదవులిచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ అని, 1356 పదవుల్లో 51 శాతం మహిళలకే ఇచ్చామన్నారు.
శాసనమండలి తొలి వైస్ చైర్మన్గా జాఖియా ఖానమ్ను నియమించామని, రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం, హోంమంత్రి, సీఎస్, ఎలక్షన్ అధికారిగా పదవులు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలో ఏపీతో సమానంగా ఏ ప్రభుత్వం మహిళలను బలపరచలేదన్నారు. ఇప్పటి వరకూ 44.5 లక్షల మంది మహిళలకు రూ. 13,022 కోట్లు అమ్మవడి ద్వారా ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.