కొత్త పథకాలేం పెడదాం?

ABN , First Publish Date - 2022-03-06T14:01:46+05:30 IST

వార్షిక బడ్జెట్‌లో పెట్టాల్సిన ప్రతిపాదనలు, కొత్తగా అమలు చేయాల్సిన ప్రజా సంక్షేమ పథకాలపై శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం చర్చించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ

కొత్త పథకాలేం పెడదాం?

                 - బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చ


చెన్నై: వార్షిక బడ్జెట్‌లో పెట్టాల్సిన ప్రతిపాదనలు, కొత్తగా అమలు చేయాల్సిన ప్రజా సంక్షేమ పథకాలపై శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం చర్చించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గం బడ్జెట్‌పై కూలంకషంగా చర్చించింది. ప్రత్యేకించి వ్యవసాయ బడ్జెట్‌లో కొత్తగా చేర్చాల్సిన ప్రతిపాదనలకు సంబంధించి కూడా మంత్రి వర్గం చర్చించింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో  మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, దామో అన్బరసన్‌, సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు తదితరులంతా పాల్గొన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తిస్థాయి ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశబెట్టనుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో డీఎంకేకు ఘనవిజయాన్ని చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని సీనియర్‌ మంత్రులు సీఎంకు సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద, బియ్యంకార్డులు కలిగిన కుటుంబాల్లో గృహిణులకు ప్రతినెలా వెయ్యిరూపాయలను బ్యాంక్‌ ఖాతాలో జమ చేసే పథకాన్ని అమలు చేయడంపైనా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుండటంతో మరిన్ని ప్రజాకర్షణీయమైన పథకాలను కూడా ప్రకటించాలని సూచించారు. అదే విధంగా వెనుకబడిన వివిధ రంగాలను గాడిలో పెట్టడంపై మంత్రులు చర్చించారు. శాఖల వారీగా కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన పథకాలు, వాటికి అవసరమయ్యే నిధులు, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అవసరమైన నిధులపై మంత్రులు చర్చించారు.

Updated Date - 2022-03-06T14:01:46+05:30 IST