ఢిల్లీలో సీఎం స్టాలిన్కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2021-06-18T13:10:08+05:30 IST
రెండు రోజలు పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విమానాశ్రయం వద్ద, తమిళనాడు హౌస్ వద్ద ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర
చెన్నై: రెండు రోజలు పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విమానాశ్రయం వద్ద, తమిళనాడు హౌస్ వద్ద ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీని కలుసుకునే నిమిత్తం తొలిసారిగా ఆయన ఢిల్లీ వెళ్ళారు. గురువారం ఉదయం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, మంత్రి దురైమురుగన్, సహాయకుడు దినేష్, ప్రత్యేక కార్యదర్శులు ఉదయచంద్రన్, ఉమానాథ్ సెల్వరాజ్ చెన్నై నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. ఉదయం పది గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న స్టాలిన్కు డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, కనిమొళి, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి ఏకేఎస్ విజయన్ తదితరులు ఘనస్వాగతం పలికారు. స్టాలిన్కు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువలతో సత్కరించారు. అటుపిమ్మట విమానాశ్రయం నుంచి బయల్దేరిన స్టాలిన్ మార్గమధ్యంలో ఢిల్లీ ఓటీఐఎస్ ప్రాంతంలో నిర్మితమవుతున్న డీఎంకే కార్యాలయం ‘అరివాలయం’ను సందర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడు హౌస్ చేరుకున్న స్టాలిన్ ఢిల్లీ బెటాలియన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, డీఎంకే ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం తమిళనాడు హౌస్లోనే స్టాలిన్ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత డీఎంకే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు.